ఎలుగెత్తిన పోలేపల్లి
గెలుపు తారుమారు చేసిన సెజ్ ఓట్లు
(ఆన్లైన్, మహబూబ్నగర్) పోలేపల్లి పోరు గెలిచింది. ఎన్నికలలో విజయా లు ఎలా ఉన్నా పోలేపల్లి సెజ్ బాధితుల పోరాటం నెగ్గింది. బాధితులు ఓడినా సమస్యకు పరిష్కారం దొరికింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఉప ఎన్నికలను సెజ్ సమస్య కుదిపేసింది. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అనుకున్నట్లుగానే సమస్య గెలిచి ప్రధాన అభ్యర్థుల గెలుపును తారుమారు చేసింది. తమ జీవితాలను రోడ్డుకీడ్చిన సెజ్ను ఎత్తివేయాలని, తమ జీవితాలకు మేలు చేయాలని పోలేపల్లి గ్రామాలకు చెందిన సెజ్ బాధితులు 14 మంది జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తండాకు చెందిన 200 ఎకరాల భూమిని ఫార్మా సెజ్కు కేటాయించారు. దీనికి పరిహారం కూడా తక్కువ మొత్తంలోనే చెల్లించారు. గ్రోత్సెంటర్ కోసం తీసుకున్న భూమిని సెజ్కు కేటాయించారు.
భూములు కోల్పోవడంతో కొందరు రైతులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. బాధితులు ప్రజాసంఘాల అండతో ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ప్రయోజనం కనిపించలేదు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బాధితులు కొన్ని నెలలపాటు పోరాటం సాగించారు. పాలకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో వారు జడ్చర్ల ఉప ఎన్నికలను ఉపయోగించుకున్నారు. సెజ్ సమస్యకు నిరసన తెలుపుతూ పోలేపల్లికి చెందిన 12 మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. భారతీయ జనతాపార్టీ కూడా మరో ఇద్దరు అభ్యర్థులను పోటీ లో నిలిపింది. వీరిని బరి నుంచి తప్పించడానికి అధికార పార్టీ సర్వశక్తులు ఉపయోగించింది.
ఆర్డీవో గ్రామానికి వెళ్లి నామినేషన్లను ఉపసంహరించుకోవాలని గట్టిగా ఒత్తిడి తెచ్చారు. కానీ బాధితులు ప్రాణాలు పోయినా పోరాటం సాగిస్తామని గట్టిగా ఎదురునిలిచారు. తర్వాత అభ్యర్థులందరూ ఓట్ల కోసం భిక్షాటన చేశారు. సంత సంతకు తిరుగుతూ సెజ్ సమస్యను విన్నవించారు. దాతలు దయ తలచి పెట్టిన భోజనాన్ని ఆరగించి అక్కడే ఓట్ల కోసం ప్రచారం నిర్వహించారు. వినూత్న రీతిలో సాగిన ఈ ప్రచారం అభ్యర్థులలో గుబులు రేపింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిం ది. ఇక ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలో ఈ సమస్యను ప్రశ్నిస్తారనే భయంతో పోలీసులు సెజ్ బాధితులను అక్రమంగా నిర్బంధించారు. ఇది వెల్లడై సంచలనం కలిగించింది.
ఇలా ప్రచారంలో సంచలనం రేపినట్లుగానే ఓట్లు దక్కించుకోవడంలో కూడా ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిం చారు. మొత్తం స్వతంత్ర అభ్యర్థులకు 11,954 ఓట్లు రాగా, అందులో సెజ్ బాధిత అభ్యర్థులకు 8,011 ఓట్లు వచ్చాయి. వీరు పోటీలో లేకుంటే ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేది. సెజ్ సమస్యపై పోరు సాగించిన ఎట్టి చిన్న వెంకటయ్యకు 162 ఓట్లు, ఎట్టి లింగయ్యకు 182 ఓట్లు, కందూరి కుర్మయ్యకు 313 ఓట్లు, కందూరు నర్సయ్యకు 366, దేపాల్ యాదయ్యకు 678 ఓట్లు, బచ్చంగారి శీనయ్యకు 480, మాల జంగిలమ్మకు 1771, ముదావత్ చాందికి 892, మొగులమ్మకు 435, సత్యమ్మకు 194, ఎ. శీనయ్యకు 245 ఓట్లు వచ్చాయి.
ఇక సెజ్ బాధితులకు మద్దతుగా నామినేషన్లు వేసిన జి. గోపాలకృష్ణకు 221, రావుల కిష్టయ్యకు 558, వేల నాగయ్యకు 521 ఓట్లు, సాజిదా సికందర్కు 213 ఓట్లు వచ్చాయి. ఇక సెజ్ బాధితుల సొంత గ్రామమైన పోలేపల్లిలోనూ 51వ బూత్ లో 676 ఓట్లు పోల్ కాగా, అందులో 102 ఓట్ల పోలేపల్లి సమస్యకు వేశారు. 52వ బూత్లో 678 ఓట్లు పోల్ కాగా, 147 ఓట్లు సెజ్ సమస్యకు వేశారు. ఈ విధంగా సమస్యను వెలుగులోకి తేవడంలో బాధితులు విజయం సాధించారు. సెజ్ సమస్య పరిష్కారానికి సత్వరమే కృషి చేస్తానన్న మల్లురవి విజయం సాధించారు. కనుక తక్షణమే సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని బాధితులు ఆశిస్తున్నారు.
Courtesy: Andhrajyothy
Date: 02, June 2008







ఇంతకీ పోలేపల్లి రైతుల కారణంగా తెలుగుదేశం ఓడిపోయినట్లా? మల్లు రవి ఇప్పటిదాకా చెయ్యని కృషి ఇప్పుడు చేస్తాడా? నమ్మశక్యంగా లేదు. ఆయనకు ఎన్ని రియల్ ఎస్టేట్ లావాదేవిలు ఉన్నాయో? దొంగకు తాళాలివ్వటమంటే ఇదే.
అబ్రకదబ్ర
June 2, 2008 at 3:03 pm
growth centre pettina waarini (TDP) ,pharma company pettadaaniki sahakarinchina waarini (TRS) prajalu odinchaaru….abrakadabra gaaru …ippudu mallu ravi ki oka avakasham ichcharu…nyayam jarugaka pote…malli twaralone tama teerpistaaru…
sanjay
July 23, 2008 at 7:02 pm